Pages

Thursday, May 27, 2010

మాస్‌పై పేలిన తూటా గోపీచంద్ "గోలీమార్"


నటీనటులు: గోపీచంద్, ప్రియమణి, రోజా, నాజర్, ఎంఎస్ నారాయణ, షవర్ అలీ, కెల్లీ దోర్జ్, జీవా, గెస్ట్ రోల్‌లో ప్రకాష్ రాజ్


సంగీతం: చక్రి, కథ-స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: పూరీ జగన్నాథ్, నిర్మాత: బెల్లంకొండ సురేష్, బేనర్: శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్



పాయింట్: గంగారామ్ గంగూభాయ్‌గా ఎలా మారాడన్నది పాయింట్



ఈ చిత్రం మొదట్లోనే రామ్‌గోపాల్ వర్మకు ధన్యవాదాలు తెలియజేసే స్లైడ్‌ను పూరీ జగన్నాథ్ వేశాడు. కథ ముందుగా చెప్పినట్లుగా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ గురించి. రామ్‌గోపాల్ వర్మ "అబ్‌తక్ చప్పన్" సినిమా రూపొందించారు. అందులో హీరో పాత్రను పూరీ గోపీచంద్‌కు ఆపాదించాడు. దయానాయక్ ప్రేరణగా తెలుగులో సినిమాలు చాలా వచ్చాయి.



అరకులో చాలా పాటలు షూట్ చేశారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుందంటున్నారు పూరీ. ఇది ఆయన స్టైల్‌లో ఉంది. కాకపోతే పోలీస్ కథాంశం అనగానే "పోకిరి"ని ఇంకా మర్చిపోలేదు ప్రేక్షకులు, అలాగే పూరీ కూడా ఆ సినిమాను మర్చిపోయినట్లు కనబడలేదు. అదే ప్యాట్రన్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమాను లాగించేశాడు.



ఇక కథలోకి వెళితే... గంగారాం ఓ అనాధ. చిన్నతనంలోనే పోలీసు అవ్వాలనే కోరిక. దాన్ని నెరవేర్చుకోవడానికి ఓ హోటల్ క్లీనర్‌గా చేరుతాడు. యజమాని ఎం.ఎస్ నారాయణ వద్దన్నా వినకుండా పనిలో చేరి తన పనిని ప్రారంభిస్తాడు. అలా అక్కడే ఉంటూ నైట్ స్కూల్లో చదువుతూ అనుకున్నట్లుగా ఇన్‌స్పెక్టర్ స్థాయికి చేరుతాడు. డ్యూటీలో చేరిన రోజే నలుగురు వాంటెడ్ రౌడీలను పట్టుకుంటాడు.



ఇతని దూకుడును చూసి డీఎస్పీ నాజర్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా బాధ్యతలు అప్పగిస్తాడు. తనకు తోడుగా ఉన్న నలుగురితో సిటీలో ఉన్న తల్వార్( షవర్ అలీ) గ్రూప్ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తూ వారి అనుచరులను మట్టుబెడతాడు. ఇక మలేషియాలో ఉండి హైదరాబాదులో చక్రం తిప్పే మాఫియా ఖలీద్(కెల్లీ దోర్జీ)కు అడ్డుకట్ట వేసే క్రమంలో డీఎస్పీ నుంచి ఊహించని సంఘటన ఎదుర్కొంటాడు గంగారామ్. ఆ దెబ్బతో తను అవినీతి అధికారిగా చిత్రించబడతాడు. ఉద్యోగం పోతుంది.



ఆ తర్వాత మోసం తెలిసి మోసాన్ని మోసంతోనే గెలవాలని గంగూభాయ్‌గా అవతారమెత్తి పోలీసు అధికారులతోపాటు డీజీపిని చంపేసి, ఖలీద్‌ను కూడా వెతుక్కుంటూ మలేషియా వెళ్లి చంపేస్తాడు. అయితే మధ్యలో పవిత్ర( ప్రియమణి) పాత్ర ఎంటరవుతుంది. మగాళ్లంటే అసహ్యించుకునే ఆమె గంగారామ్ పరిచయంతో ప్రేమలో పడుతుంది. ఈమె తల్లి అరుంధతి( రోజా) తనలాగే తన కూతురు మగాడి చేతిలో మోసపోకూడదని ఆమెను మగ ద్వేషిగా పెంచుతుంది. సినిమాలో వీరిద్దరి ట్రాక్ కథాగమనాన్ని పెంచేదిగా, కాస్త కామెడీగా ఉంటుంది.



ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా గోపీచంద్ ఇమిడిపోయాడు. ఆహార్యం, అభినయం సరిపోయాయి. సీరియస్‌గా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ మానవత్వంగా అనాధలకు సేవ చేస్తుంటాడు. ప్రియమణి పాత్ర నామమాత్రమే అయినా అభినయానికి ఆస్కారమున్న పాత్ర. తాగే సన్నివేశంలో బాగా నటించింది. డేర్ అండ్ డెవిల్‌గా నటించే పాత్రలో రోజా సరిపోయింది. కూతుర్ని కాపాడుకునే క్రమంలో ఆమె చేసే పనులు బాగానే ఉన్నాయి.



నాజర్ డీజీపీగా బాగానే చేశాడు. మాఫియా లీడర్‌గా గతంలో డాన్ చేసిన కెల్లీ ఈ చిత్రంలో అదే తరహాలో కనిపిస్తాడు. కొత్తగా షవర్ అలీ మరో మాఫియా నాయకుడుగా నటించాడు. విలన్ పాత్రలు ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. జీవా పోలీసు అధికారిగా చేశాడు. హోటల్ యజమానిగా ఎమ్మెస్ సరిపోయాడు.



సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నది. చక్రి సంగీతం ఫర్వాలేదు. "సలామ్ లేకుం సలాం" నుంచి స్ఫూర్తిగా తీసుకుని "సలాం పోలీస్‌కు సలాం.." అనే పాట పోలీసును గౌరవించేదిగా ఉంది. మగాళ్లంటే మోసగాళ్లు... అంటూ ప్రియమణి పాడే పాట మగాళ్లపై సెటైర్ అయినా ఎక్స్‌టార్డినరీగా ఏమీ లేదు. కళ్లలో ఏదో గమ్మత్తుగా ఉంది అనే పాట అరబిక్ ట్యూన్‌ను పోలి ఉంది.



సంభాషణలు పొందికగా ఉన్నాయి. "నా కూతుర్ని మదర్‌లా కాదు మదర్ థెరిస్సాలా చూడాలనుకున్నా.... ఇంటిలో ఎలుకలు మనముందే తిరుగుతాయి.. ఏమీ చేయలేం....అందుకే బోను పెడితే ఒక్కోటి చిక్కుతుంది.. అంటూ మాఫియాపై డీజీపి చేసే వ్యాఖ్యలు సందర్భానుసారంగా ఉన్నాయి. ఇక హీరోయిన్ చేత "తొక్కలోది" అనిపించడం యువత ప్రవర్తించే తీరుకు సపోర్ట్ చేసేదిగా ఉంది. పాత్రలన్నీ కథకు సరిపోయేవే అయినా సీరియస్‌గా సాగే ఈ చిత్రంలో మహిళలను ఆకట్టుకునే అంశాలు లేవు. మాస్‌ను బాగా ఆకట్టుకుంటుంది. పోకిరిలో పోలీసు రౌడీలా మాఫియాలో చేరి రహస్యాలు తెలుసుకుంటాడు. గోలీమార్‌లో పోలీసు, మాఫియాలా ఎందుకయ్యాడో చూపించాడు.



మాఫియాను సినిమాలో చూపించినంత ఈజీగా ఎదుర్కోవడం అసంభవం. సినిమా కాబట్టి ఎంతటి పవర్‌ఫుల్ వ్యక్తులనైనా హీరో వారిని వెంటనే పట్టుకుని కాల్చేయడం.. వారి రహస్యాలు ఈజీగా తెలిసిపోతుండటం జరుగుతాయి. మాఫియా నెట్వర్క్ ఎలా ఉంటుందనేది చిత్రంలో చూపాడు. యాక్షన్ సినిమాలు చూసిన వారిగి ఈ చిత్రం పెద్దగా నచ్చకపోవచ్చు. చూసే వారికి మాత్రం కాలక్షేపం బాగానే ఉంటుంది.

Sunday, May 16, 2010

"రామరామ కృష్ణకృష్ణ" రామరామ కృష్ణకృష్ణలానే ఉంది..!!


నటీనటులు: రామ్, ప్రియా, ఆనంద్, బిందుమాధవి, అర్జున్, నాజర్, వినీత్ కుమార్, బ్రహ్మానందం, షిండే, శ్రీనివాసరెడ్డి తదితరులు


మాటలు: ఎం.రత్నం, కెమేరా: శేఖర్ వి.జోసెఫ్, సంగీతం: కీరవాణి, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాత: రాజు, కథ - స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్



పాయింట్: పట్టింపులు పంతాలు గల ఇంటిలో తన సోదరుని పెళ్లి చేయడానికి తమ్ముడు ఎన్ని జిమ్మిక్కులు చేసి తండ్రిని ఒప్పించాడనేది కథ



రామ్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథతో రెడీ సినిమా వచ్చింది. అంతకుముందు హీరో విష్ణు ఢీ అనే సినిమా కూడా వచ్చింది. ఈ రెండింటిలో తను ప్రేమించిన ప్రియురాలు దగ్గరే ఉంటూ వాళ్లవాళ్ల ఇంటిలో ఎవరికీ తెలీకుండా కథ నడుపుతాడు హీరో. రామరామ కృష్ణకృష్ణలో కూడా అదే తరహాలో సాగుతూ... తన సోదరుని ప్రేమ వ్యవహారాన్ని చక్కబెడుతూ... పనిలోపనిగా ప్రేమను పొందుతాడు ఈ హీరో.



కథ గురించి చెప్పాలంటే... రామకృష్ణ(రామ్) ఆ ఊరిలో డేరింగ్ పనులు చేస్తుంటాడు. తండ్రి చక్రపాణి( నాజర్) ఊరికి పెద్ద. కట్టుబాట్లకు పెద్దపీట వేసే చక్రపాణికి ప్రేమ వివాహాలు గిట్టవు. ఇందుకు సొంత సోదరుడు బ్రహ్మానందాన్ని కూడా దూరం చేసుకుంటాడు. అలాంటి ఊరిలో శివరాజ్( అర్జున్) తన ఇద్దరు చెల్లెళ్లతో కాలంగడుపుతుంటాడు. అందులో పెద్ద చెల్లెల్ని రామ్ సోదరుడు ప్రేమిస్తాడు. ఇద్దరూ సిటీలో డాక్టర్ కోర్సు చదువుతుంటారు.



నాన్న విషయం తెలిసిన రామ్ వారిద్దరి పెండ్లి తాను దగ్గరుండి జరిపిస్తానని భుజాలపై వేసుకుంటాడు. అనుకున్నట్లుగానే రకరకాల తెలివితేటలతో పెండ్లి పీటల దాకా తెస్తాడు. ఆ సమయంలో ముంబై డాన్ పవర్( వినీత్ కుమార్) అనుచరులు రామ్ కోసం విలేజ్ వచ్చి టార్గెట్ చేస్తారు. ఇది శివరాజ్‌కు తెలిసి రామ్‌ను ఎలా కాపాడాడు..? అసలు ముంబై డాన్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు..? అన్నది సినిమా.



అసలు కథ ముంబై నుంచి ప్రారంభమై గోదావరి ప్రాంతంలో ముగుస్తుంది. ముంబైలో డాన్‌గా అర్జున్ ఎలా మారాడు అన్న దానిలో క్లారిటీ ఉంది. అటువంటి వ్యక్తి వల్లే తన భార్య చనిపోవడంతో ఆమె చివరికోరిక మేరకు ఆ కూపం నుంచి బయటపడి గోదావరి ప్రాంతానికి వస్తాడు. ఆయన అనుచరులు బెనర్జీ, మురళి సరిపోయారు. ఆ ఎపిసోడ్ భాషా చిత్రాన్ని తలపిస్తుంది.



కథను మాఫియాతో లింక్ చేసి చూపే విధానం కూడా ఫర్వాలేదు. అక్కడ బ్రహ్మానందం ముస్లిం ఆమెను వివాహం చేసుకుని సెటిల్ కావడం... రామ్ తన సోదరుడు ప్రేమించిన అమ్మాయి పెండ్లి చేసి తీసుక వచ్చేందుకుగాను బాబాయ్ బ్రహ్మానందం దగ్గరకు వెళతాడు. ఇక ఆ తర్వాత మాఫియాతో రామ్ ఎదుర్కొన్న యాక్షన్ సన్నివేశాలు అన్నీ సినిమాటిక్‌గా ఉంటాయి.



ముంబైలో పేరుమోసిన మాఫియా లీడర్ పవార్‌ను, ఆయన అనుచరులను తుపాకులతో కాల్చడం, ముంబై వీధుల్లో వారి నుంచి తప్పించుకోవడం అనేవి కాస్త కృతకంగా ఉన్నాయి. క్లైమాక్స్‌లో వాళ్లందరినీ కత్తులతో నరకడం వంటివి మగధీర చిత్రాన్ని గుర్తుకు తెస్తాయి. అసలు అంత హింస ఈ కథకు అవసరం లేదనిపిస్తుంది. అర్జున్ భార్య గ్రేసీ సింగ్ చనిపోవడం, రామ్‌కోసం స్వామీజీలు వెతకడం అనేది బంగారు బుల్లోడులోని కొన్ని సన్నివేశాలు గుర్తుకు తెస్తాయి. మొత్తంగా అవీఇవీ కలిపి ఒక సినిమాగా తయారు చేశాడు దర్శకుడు శ్రీనివాస్. లక్ష్యం తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది.



విలన్‌గా వినీత్ కుమార్ కొత్తదనంకోసమే తెచ్చినట్లుంది మినహా ప్రత్యేకత ఏమీలేదు. సినిమాటోగ్రఫీపరంగా బాగానే ఉంది.సంగీతపరంగా కీరవాణి మైనస్సనే చెప్పాలి. దరువుల మోతతో సాహిత్యం అర్థం కాకుండా పోయింది. మెలోడి సంగీతాన్ని సమకూర్చే కీరవాణి మాస్‌ను కూడా టచ్ చేయగలనని ముందడుగు వేశాడు. బిందుమాధవి పాత్ర హీరో వెంటపడుతూ... కాస్త మాస్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి సరిపోయింది. భార్య రాత్రి పక్కలో లేకపోతే తట్టుకోలేని విధంగా బ్రహ్మానందం మాస్‌ను ఆకట్టుకోవచ్చునేమోగానీ ట్రెండ్ వెర్రిపోకడలకు దారితీస్తున్నట్లు కనబడుతుంది.



తను హీరోను ప్రేమించిన విషయం తన అన్న అర్జున్‌కు తెలిసినా ఏవో చిన్నపాటి గొడవలతో ఆమెకు వేరే సంబంధం చూసి పెండ్లి పీటలపైకి తేవడం... హీరో దేవదాసులా మారడం... చివర్లో హీరో గురించి అన్న తెలుసుకోవడం... కథ సుఖాంతం కావడం... ఇలా రొటీన్ తంతు రామరామ కృష్ణకృష్ణలో కూడా ఉంది.



గోదావరి ఎపిసోడ్ చిత్రానికి కాస్త రిలీఫ్ ఇచ్చిందనుకోవాలి. మాఫియాను ఎదుర్కొనే సన్నివేశాలు కాస్త బరువుగా ఉంటాయి. మొత్తంగా ఇది ఓ మోస్తరు సినిమా మాత్రమే.

Sunday, May 2, 2010

దుష్ట శిక్షణకు వైద్యుడే.. నర "సింహా"వతారం ఎత్తితే..!?


నటీనటులు: నందమూరి బాలకృష్ణ, నయనతార, నమిత, స్నేహాఉల్లాల్, కె.ఆర్‌.విజయ, మలయాళ నటుడు సాయికుమార్‌, హేమంత్‌, శ్రావణ్‌, జీవీ, కిన్నెర, కోటశ్రీనివాసరావు, వేణుమాధవ్‌, బ్రహ్మానందం, ఝాన్సీ, అలీ, కృష్ణభగవాన్‌, ఎల్బీశ్రీరామ్‌, ఆనందభారతి తదితరులు.


సంగీతం: చక్రి,

నిర్మాత: పరుచూరి కిరిటీ,

బేనర్‌: యునైటెడ్‌ మూవీస్‌,

రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను.


పాయింట్‌: మనిషికి వ్యాధి సోకితే వైద్యం చేసే వైద్యుడు సమాజాన్ని పాడుచేసే వైరస్‌కు (దుష్టులను) ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చాడనేదే పాయింట్.



టైటిల్‌ వినగానే నరసింహనాయుడు, లక్ష్మీనరసింహా, సమరసింహారెడ్డి- ఇలా సింహా సెంటిమెంట్‌తో మళ్ళీ బాలకృష్ణ విజృంభిస్తాడని ముందుగానే చెప్పిన దర్శకుడు బోయపాటి శ్రీను అటువంటి తరహా కథతో ముందుకువచ్చాడు. ఇది పక్కా బాలయ్య మార్క్‌ సినిమా.



ఇన్నాళ్ళు ఎలాంటి కథాశంతో అభిమానుల్ని సంపాదించుకున్నాడో అలాంటి అభిమానులు మెచ్చేలా, వారి అంచనాలకు అనుగుణంగా బాలయ్య కథాంశాన్ని ఎంచుకున్నాడు. దీనికితోడు నాలుగు పాటలుకూడా బాగుండడంతో సింహా ఫ్యాన్స్‌కు ఫుల్‌మీల్స్‌‌ అయ్యింది.



అయితే భద్ర, తులసిలో ఉన్నట్లే... దర్శకుడు బాలయ్య రేంజ్‌కు తగినట్లుగా బాంబు పేలుళ్లు, కత్తులతో నరకడాలు మామూలుగా ఉన్నాయి. కొన్ని చోట్ల డైలాగ్స్‌లు ఆవేశంగా 'లంజకొడకా..' అంటూ ఉన్నా సన్నివేశపరంగా కొట్టకుపోయాయి. కాకపోతే వయొలెన్స్‌ ఎక్కువగా ఉన్న ఈ చిత్రాన్ని హ్యుమన్‌రైట్స్‌ సంస్థలు వేలెత్తిచూపుతాయోనని చిన్నపాటి సందేహంకూడా ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇక.. ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య మెప్పించాడు.




కథలోకి వెళితే...? విజయనగరం జిల్లా బొబ్బిలిలో రెండే పెద్ద కుటుంబాలు. అందులో ఒకటి నరసింహా (బాలకృష్ణ) కుటుంబం. మరొకటి కోటశ్రీనివాసరావు కుంటుంబం. వీరిలో నరసింహా చెడును ఏ మాత్రం సహించడు. ప్రజలకు మంచిచేయాలనుకుంటాడు. కానీ కోటశ్రీనివాసరావు కుటుంబం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంది.



ప్రజలు ఏమైనా పర్వాలేదు. వారందరూ తాము చెప్పినట్లే వినాలి. పోలీసువ్యవస్థను కూడా చేతుల్లో తీసుకుని కోటశ్రీనివాసరావు బోలెడు అరాచకాలు చేస్తుంటాడు. ఇది సహించని నరసింహ వారికి బుద్దిచెప్పే క్రమంలో కోట కొడుకుల్లో ఇద్దరిని చంపేస్తాడు. దీంతో పగ, ప్రతీకారంతో రగిలిపోతున్న కోటశ్రీనివాసరావు మరో కొడుకు సాయికుమార్‌, నరసింహ కుటుంబాన్ని తుదముట్టిస్తాడు.



కానీ అందులోని వంశోద్ధారకుడు శ్రీమన్నారాయణ (బాలకృష్ణ)ను నాయనమ్మ కె.ఆర్‌. విజయ రహస్యంగా తప్పించి హైదరాబాద్‌ సిటీకి వచ్చి పెంచుతుంది. పెద్దవాడయిన శ్రీమన్నారాయణ కాలేజీ ప్రొఫెసర్‌. ఆయనలోనూ అదే పోకడ. చెడును సహించడు. ఈ క్రమంలో ఈవ్‌టీజింగ్‌, డ్రగ్స్‌కు బానిసలైన యువకులకు బుద్ధిచెబుతాడు.



ఆ క్రమంలో జానకి (స్నేహ ఉల్లాల్‌) అనే స్టూడెంట్‌ను వదిన అని సంబోధిస్తూ.. ఓ రౌడీ తన అన్న రమ్మంటున్నాడని బలవంతంగా తీసుకెళతాడు. ఆ రౌడీ నుంచి స్నేహాఉల్లాల్‌ను శ్రీమన్నారాయణ కాపాడి, ఆమె ఫ్యాష్‌బ్యాక్‌ తెలుసుకుని తను ఆశ్రయమిస్తాడు.



జానకి ఉన్న విషయాన్నితెలుసుకుని ఆమె తండ్రి రఘు వచ్చి అనుకోకుండా అక్కడ జరిగే గొడవల్లో శ్రీమన్నారాయణను పొడవబోయి బామ్మను పొడుస్తాడు. కసితో రఘును కత్తితో పొడుస్తుండగా బామ్మ వారిస్తుంది. అసలు రఘు ఎవరు..? శ్రీమన్నారాయణ ఎవరు..? జానకి ఎవరు..? అనే విషయాలు తెలియాలంటే మిగిలిన సినిమా చూడాల్సిందే.



ఇందులో కాలేజీ ప్రొఫెసర్‌ ఎపిసోడ్‌ మొదటి భాగంగా.. బొబ్బిలి ఎపిసోడ్‌ రెండో భాగంగా వస్తుంది. బాలకృష్ణ ప్రొఫెసర్‌గా సూటయ్యాడు. అదేవిధంగా నరసింహా పాత్రలోనూ ఇమిడిపోయాడు. డైలాగ్‌ డెలీవర్‌లో కొత్తగా కన్పించాడు. లెంగ్తీ డైలాగ్‌లు లేకుండా సింపుల్‌గా ఉన్నా, ఇందులోనూ తన వంశం గురించి ప్రస్తావించే సంభాషణలు చొప్పించారు.



ఆయన భార్యగా నయనతార నటించింది. ఇంతకుముందు చిత్రాల్లో ఓ మోస్తరు బొద్దుగా ఉండే నయనతార చాలా తగ్గింది. బామ్మగా కె.ఆర్‌. విజయ పాత్రకు సరిపోయింది. స్నేహ ఉల్లాల్‌ తండ్రిగా రఘు నటించాడు. పనివాళ్ళుగా ఝాన్సీ, బ్రహ్మానందం నటించారు. విజయనగరం యాసను ఝాన్సీ సునాయాసంగా పలికింది.



అలీ, కృష్ణభగవాన్‌‌ పాత్రలు కాస్త నవ్విస్తాయి. సాఫ్ట్‌వేర్‌ బూమ్‌ పడిపోతే వారి ఎలాంటి జీవనం సాగిస్తారనేది అలీ పాత్ర ద్వారా దర్శకుడు చక్కగా చూపాడు. కాలేజీ లెక్చరర్‌గా నమిత కాస్త గ్లామర్‌తో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్‌ చేసింది.



ఇకపోతే ఈ సినిమాకు కెమెరా పనితనం ప్రత్యేక ఆకర్షణ. సిరివెన్నెల, చంద్రబోస్‌ పాటలు అలరించాయి. "సింహంలాంటి చిన్నోడు వేటకొచ్చాడు.." అనే మాస్‌ పాట ఆకట్టుకుంది. "బంగారుకొండ మువ్వులదండ.." అనే పాట నయనతార, బాలయ్యతో చిత్రించినా సందర్భానుసారంగా ఉంది.



కథ సీరియస్‌గా నడుస్తుండగా.. 'జానకి జానకి.. అని సాగే చివరి పాట బ్రేక్‌లా వేసి.. ప్రేక్షకుల్ని డైవర్షన్‌ చేసి కాస్త రిలీప్‌ ఇచ్చాడు. అయినా ఇది అడ్డంకిగా ఉంది. సంభాషణలు పొందికగానే ఉన్నాయి. 'డాక్టర్‌కు కుట్లు వేయడమేకాదు. పోట్లు వేయడం కూడా తెలుసు.. వంటి కొన్ని డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి.



మొత్తానికి ఇది బాలయ్య ట్రేడ్‌ చిత్రం. 'మిత్రుడు' అంతటి ఫ్లాప్‌ తర్వాత బాలయ్య ఎటువంటి సినిమా చేస్తాడనేది ఫ్యాన్స్‌లోనూ ప్రేక్షకుల్లోనూ నెలకొన్న ఉత్కంఠకు "సింహా" ద్వారా తెరదించాడు. మంచి కథా వస్తువుతో బాలయ్య మెప్పించాడు. ఇంకేముంది..? మరి.. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ రేంజ్‌కు తీసుకుకెళ్ళాతారో..? వేచి చూడాల్సిందే..!?

Wednesday, April 28, 2010

పెళ్లి పీటలపైనే "వధువు"ను చూస్తాననే "వరుడు" ఉంటాడా...?!!


నటీనటులు : అల్లు అర్జున్, భాను శ్రీ మెహ్రా, ఆర్య, సుహాసిని, ఆశిష్ విద్యార్థి, షాయాజీషిండే, నాజర్, నరేష్, విజయ, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, శ్రీనివాసరావు, అనితా చౌదరి, బ్రహ్మానందం తదితరులు. సినిమాటోగ్రఫీ : ఆర్.డి, రాజశేఖర్, సంగీతం : మణిశర్మ, ఎడిటింగ్ : ఆంథోని, ఫైట్స్ : స్టన్ శివ, మాటలు : తోట ప్రసాద్, నిర్మాత : డి.వి.వి. దానయ్య, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : గుణశేఖర్.పాయింట్ : మంచి సంతానంతో సమాజానికి మేలు చేకూరుతుంది. అక్రమ సంతానంతో సమాజానికి కీడు కలుగుతుందన్న విషయాన్ని గుణశేఖర్ "వరుడు"లో చూపించాడు.కథ : ప్రేమించి పెళ్లిచేసుకున్న వసు (సుహాసిని), గోపి (ఆశిష్ విద్యార్థి) సంతానమే సందీప్ ఉరఫ్ సాండీ (అల్లు అర్జున్). ఇతడికి స్నేహితులతో కలిసి పబ్‌ల్లో ఎంజాయ్ చేయడం మామూలైన విషయం. కానీ పెళ్ళి మాత్రం సాంప్రదాయంగా పెద్దలు కుదిర్చిన వారినే చేసుకుంటాననే నైజం. అది ఎలాగంటే..? తన తాతలు చేసుకున్న వందేళ్ళనాటి పద్ధతి ప్రకారం 16 రోజుల కార్యక్రమంలో ఐదు రోజులు పెళ్ళి తంతు ఉండాలన్నది అతని కోరిక. అప్పట్లో పెళ్ళి కూతుర్ని పీటలపైనే చూసేవారు. అలాగే తనూ చూస్తానని తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్ళికి సిద్ధమవుతాడు సాండీ.పెళ్లికూతురు పేరు దీప్తి (భానుమెహ్రా). ఆమెకూ ఇవే భావాలుంటాయి. గంతకు తగ్గ బొంతలా కుదురుతుంది. సరిగ్గా పెళ్ళిపీఠలపై కూర్చుని జీలకర బెల్లం పెడుతుండగా మంటపం కూలిపోవడం, పెళ్లికూతురు అపహరణకు గురవడం జరుగుతుంది. అపహరణ చేసింది దివాకర్ (ఆర్య), అతనో సైకో. అక్రమసంతానం వల్ల పుట్టినవాడు. సమాజాన్ని ఎలా భ్రష్టు పట్టించాలో అలా పట్టిస్తుంటాడు. పోలీసులు కూడా అతని ఆగడాలని అరికట్టలేకపోతారు. వాడి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న సందీప్ వాడిని ఎదిరించి వాడికళ్ళముందే అదే పెళ్లిమండపంలో ఎలా పెళ్లిచేసుకున్నాడు? అడ్డువచ్చిన దివాకర్‌ను ఎలా అంతమొందించాడు అన్నది "వరుడు" సినిమా.అల్లు అర్జున్ వయస్సుకు తగ్గట్లుగా బాడీలో ఎనర్జీ పాళ్లు ఎక్కువే. డాన్స్‌లోనూ, ఫైట్స్‌లోనూ (కొంత గ్రాఫిక్స్ అయినా) అది కనపడింది. డైలాగ్ మాడ్యులేషన్ ఎమోషన్‌లో సరిగ్గా సూటుకాలేదు. కానీ వరుడుగా బాడీని కావాల్సినంత ఎక్స్‌ఫోజ్ చేసి ఒక వర్గాన్ని మెప్పిస్తాడు. హీరోయిన్ ఎవరా? అని గోప్యంగా ఉంచి అమృత్‌సర్ అమ్మాయిని చూపించారు. పెళ్లితంతులో ఆభరణాలు, మేకప్‌లో కళ్లకు బాగానే అనిపించింది. కాలేజీ చదివే ఎపిసోడ్‌లో మాత్రం అంత అందం కనబడదు. నార్మల్ గాళ్‌గా ఉంది. ఆమెకు హీరోతో కొద్దిపాటి డైలాగ్స్ మినహా పెద్దగా ప్రాధాన్యత లేదు. దివాకర్ పాత్రలో ఆర్య ఆకట్టుకున్నాడు. అతనిది సైకో పాత్ర. తనకు అడ్డూఅదుపులేకపోతే ఎలా ఉంటాడో చూపాడు. నాటకాలపిచ్చి. కోరింది దక్కకపోతే సహించడు. కామంతో రగిలిపోతుంటాడు. కూష్మాండా అంటూ.. తను నాటకాల్లో వేసిన పాత్రను జ్ఞప్తికి తెచ్చుకుంటూ చెడుపనులు చేస్తుంటాడు. పూర్తిగా ఎమోషనల్ పాత్ర. విలన్‌గా కథాపరంగా సూటయ్యాడు. ఇక సందీప్ తల్లిదండ్రులు, దీప్తి తల్లిదండ్రుల పాత్రలు రొటీన్. తాతగా సింగీతం శ్రీనివాసరావు నటించాడు. దర్శకుడిగా తను పాత్రల నుంచి ఏ మేరకు రాబట్టుకోవాలో ఆయనకు తెలుసుకానీ, తనే నటుడైతే ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా తెలిసిందనుకోవచ్చు. సన్నివేశపరంగా డైలాగ్‌లు చెప్పడంలో.. ఫీలింగ్ ఉండేలా అనిపించవు.ఇక బ్రహ్మానందం పెళ్ళిళ్ల పేరయ్య ఎపిసోడ్ కామెడీకోసం పెట్టినా అది వెగటు పుట్టిస్తుంది. సునీల్, అలీ పాత్రల్ని ఒక పాటలో మినహా ఉపయోగించుకోలేకపోయారు. మొత్తంగా పెళ్ళితంతులో హాస్యం మిస్సయ్యింది. మధ్యమధ్యలో బంధువులంతా కలిసి చమక్కులతో విసిరిన సామెతలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమాకు ఈ ఎపిసోడ్ కామెడీకి ప్రాణం. కామెడీని గుణశేఖర్ సరిగ్గా డీల్‌ చేయలేకపోయాడనిపించింది. నిన్నే పెళ్ళాడుతాలో.. సీనియర్ నటీనటులతో హాస్యం పండించినంతగా చేస్తే బాగుండేది. కానీ "వరుడు"లో పెళ్లి కార్యక్రమంలో పాల్గొన్న వారంతా కొత్త వారే. షాయాజీ షిండే హోం మంత్రిగా నటించాడు. నాజర్, రావురమేష్ పోలీసు అధికారులుగా చేశారు.పెళ్ళితంతులో వేటూరి సుందరరామ్మూర్తి రాసిన సాహిత్యం సినిమాలో హైలైట్ అవుతుందన్న దర్శకుడి మాట నిలబడలేదు. ఒక్కపాటలోనే 16రోజుల తంతును చూపించే ప్రయత్నం చేశాడు. మినహా.. ఏ రోజు ఏం చేస్తారో చూపించలేకపోయారు.మణిశర్మ బాణీలు గుర్తిండిపోయేలా లేవు. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్స్ ఎమోషనల్‌గా సాగుతూ.. ఆసక్తి కలిగించినా కాసేపటికి హీరో ఎత్తైన శిఖరంపై ఉండి ఫైట్ చేయడం విడ్డూరంగా ఉంది. బహుశా అప్పటికే ఎక్కువ ఎక్స్‌పోజింగ్ అయిపోయిందని అర్థమవుతుంది. సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. పెళ్ళి గురించే గుణశేఖర్ చెప్పినా.. అందులో అన్ని సరిగ్గా అమరకపోతే పెళ్లెలా పేలవంగా ఉంటుందో ఈ సినిమాకూడా అలాగే ఉంది. ప్రధానంగా హాస్యం లేదు. సునీల్, అలీ పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోలేదు. వారు గెస్ట్‌గా పాటలో ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు. అలాగే పెళ్లికూతుర్ని కిడ్నాప్ చేసే సన్నివేశం బలంగా లేదు. దాంతో కామపిశాచిగా ఆర్య ముద్రపడిపోయాడు. మొదటి నుంచి ఇంటర్‌వెల్ వరకు సీరియల్‌గా కథ నడవదు. సెకండాఫ్‌లో విలన్ ప్రవేశంతో ఎమోషనల్‌గా ఉన్నా స్క్రీన్‌ప్లే లోపంతో ట్రాక్ తప్పింది. కొంతమేరకు సాగదీసినట్లుంది. "సైనికుడు" తర్వాత గుణశేఖర్ నుంచి వచ్చిన "వరుడు" అంత నిరాశపరిచినా.. ప్రస్తుతానికి పెద్ద సినిమాలు ఏమీలేకపోవడంతో కొద్దిరోజులైనా ఆడుతుందనేది మాత్రం నిజం.

శ్రీశ్రీ స్ఫూర్తితో శర్వానంద్ రాజకీయ "ప్రస్థానం"


నటీనటులు: శర్వానంద్, రూబీ పరిహార్, సాయికుమార్, సందీప్, జీవా, జయప్రకాష్ రెడ్డి, సురేఖావాణి, వెన్నెల కిషోర్, రేష్మ, మాస్టర్ అతులిత్ తదితరులు. సాంకేతిక సిబ్బంది : కెమెరా-శ్యామ్ దత్, సంగీతం : మహేష్ శంకర్, నిర్మాత : వల్లభనేని రవి, ఎడిటింగ్ : ధర్మేంద్ర కాకరాల, కథ-స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : దేవకట్టా.మనిషి "ప్రస్థానం" ఎలా ఉంటుందో తన కవిత్వంలో చొప్పించాడు శ్రీశ్రీ. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని కథ అల్లాడు దర్శకుడు దేవకట్టా. ఎన్నారై అయిన దేవకట్టా తొలిసారిగా తన స్నేహితులతో కలిసి "వెన్నెల" అనే చిత్రాన్ని తీసి మెప్పించాడు. మళ్ళీ చాలా కాలం గ్యాప్ తీసుకుని కథపై అవగాహనతో ముందుకు వచ్చాడు. అదే "ప్రస్థానం"గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషిలో అసూయద్వేషాలు, కోపతాపాలు, కుటుంబంలో ఒకరు ఎక్కువ, తక్కువ అనే స్వభావాలు ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందనే విషయాన్ని సజీవ పాత్రల ద్వారా చూపారు. ఇందులో నటీనటులు అందరూ బాగానే చేశారు. శర్వానంద్‌కు మంచి బ్రేక్ ఇచ్చే సినిమా. "గమ్యం" తర్వాత శర్వానంద్‌కు అంతపేరు వస్తుంది. ఇదే కథతో పేరున్న హీరో అయితే సినిమా రేంజే వేరుగా ఉండేది. కథను పూర్తి సీరియస్‌గా తెరకెక్కించిన దేవకట్టా సఫలీకృతుడయ్యాడు. కథలోకి వెళితే.. విజయవాడ నేపథ్యాన్ని దేవరకట్టా ఎంచుకున్నాడు. కృష్ణాజిల్లా మానికొండలో పలుకుబడి కలిగిన రాజకీయనాయకుడు పెద్దాయన (బాలయ్య). ముఠా కక్షల్లో సొంత కొడుకును కేశవ (రవిప్రకాష్)ను కోల్పోతాడు. కేశవ ఆప్త మిత్రుడైన లోకనాధం నాయుడు ఉరఫ్ లోకి (సాయికుమార్). పెద్దాయన కోరిక మేరకు చనిపోయిన మిత్రుడు భార్యను పెళ్లాడటమేగాక, తన మిత్రుని సంతానానికి సవతి తండ్రి అవుతాడు. కాలగమనంలో లోకి కుటుంబం విజయవాడకు మారడంతో లోకి రాజకీయ శక్తిగా ఎదిగి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందుతాడు. కొడుకు మిత్ర (శర్వానంద్) తండ్రి రాజకీయ వారసత్వంతో యువనేతగా ఎదుగుతాడు. కానీ కూతురు (సురేఖావాణి) డాక్టర్. లోకిని తండ్రిగా భావించదు. మరోవైపు లోకి స్వంత కుమారుడు చిన్న (సందీష్ కిషన్) మిత్ర ఎదుగుదలను చూసి అసూయకులోనై సైకోగా మారుతాడు. భారతంలో భీష్ముని తరహా పాత్రలో సాయికుమార్ నటించాడు. ఆ పాత్రకు, మిత్రా, సైకో చిన్నా ఈ ముగ్గురి జీవన ప్రస్థానం ఏ మేరకు సాగింది? ఇందులో సైకో ఎంతటి ఘోరానికి ఒడిగట్టాడు? అనేది సినిమా. పాత్రపరంగా అందరూ బాగానే చేశారు. సాయికుమార్ తలపండిన రాజకీయనాయకుడిగా నప్పాడు. ఆయన వాయిస్ థియేటర్లలో ఖంగుఖంగుమని మోగుతుంది. ఆవేశ, శాంత స్వభావ విన్యాసాలు బాగా చేశాడు. శర్వానంద్ సీరియస్‌గా మాస్ తరహా పాత్రను మెప్పించాడు. చెప్పుకోదగిన పాత్ర ఛోటాకేనాయుడు మేనల్లుడు సందీప్ విలన్‌గా బాగా చేశాడు. ఇంకా నవ్యత గల కథ. దేవకట్టా ప్రతి పాత్రను తెరపై మలిచిన వైనం బాగుంది. పాత్రోచితంగా రాసుకున్న స్క్రీన్‌ప్లే, సంభాషణలు ప్రస్థానానికి ప్రాణవాయువు. మంచి చెడులది ఒక్కోసారి పై చేయి.శాందత్ కెమెరా, మహేష్ శంకర్ సంగీతం బాగున్నాయి. కెమెరా పనితనం కూడా బాగుంది. మొత్తానికి ఈ వారం విడుదలైన చిత్రాల్లో "ప్రస్థానం" ఉత్తమ చిత్రంగా నిలిచింది.

Saturday, April 24, 2010

ఈ "మరోచరిత్ర" అలనాటి "మరోచరిత్ర" కాదు


నటీనటులు: వరుణ్ సందేశ్, అనిత, శ్రద్దా దాస్, ప్రతాప్ పోతన్, ఊర్వశి, ఆదర్శ్, నరేష్, వేణు, కోట శ్రీనివాసరావు తదితరులు మాటలు: ఉమర్జీ అనురాధ, కథ: కె. బాలచందర్, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: రవి యాదవ్, సంగీతం: మిక్కీజే మేయర్.ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే... గతంలో కె. బాలచందర్ తీసిన "మరోచరిత్ర" ప్రస్తావనను తీసుకరావాల్సిందే. కమల్ హాసన్, సరిత కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రాన్ని యథాతధంగా ఇప్పటి జనరేషన్‌కు అన్వయించి దిల్ రాజు తన స్నేహితులతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ముందుగానే... ఎందుకైనా మంచిదనీ... అలనాటి "మరోచరిత్ర"తో పోల్చుకోకండి. జస్ట్ ఫీల్‌ను మాత్రమే చేయండి అని స్లైడ్ వేశారు.కథగా చెప్పాలంటే... అమెరికాలో నివశించే కృష్ణమాచారి (ప్రతాప్ పోతన్)కు బాలు (వరుణ్ సందేశ్) ఒక్కగానొక్క కొడుకు. బాలు తను చదువుతున్న కోర్సును మధ్యలోనే ఆపేసి ఇంటికి వస్తాడు. పక్క ఇంట్లో ఉండే అమెరికా దుర్గ(ఊర్వశి) కుమార్తె స్వప్న(అనిత)ను మొదటి చూపులోనే ప్రేమించేస్తాడు. స్వప్న చాలా సన్నిహితంగా ఉంటూ... తన ఇంటిలోని విషయాలన్నీ ఓపెన్‌గా చెప్పేస్తుంటుంది. ఆల్రెడీ, కృష్ణమచారికి, అమెరికా దుర్గకు పడదు. కనుక వీరిద్దరి ప్రేమను అంగీకరించే సమస్యే లేదు. ఆ తర్వాత పోలీసైన పౌల్ శాస్త్రి( నరేష్) మధ్యవర్తిత్వంతో ప్రేమ వ్యవహారాన్ని ఓ ఏడాదిపాటు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒప్పందం ప్రకారం ఇద్దరూ ఏడాదిపాటు కలుసుకోకూడదు. మాట్లాడుకోకూడదు. ఆ తర్వాత ఇద్దరి మధ్య నిజంగా ప్రేమ ఉంటే పెద్దలు అంగీకరించాలి. ఇక ఏడాది తర్వాత ఇద్దరూ కలుసుకున్నారా...? లేదా...? అనేది ఈ మరోచరిత్రపాత్రపరంగా ఇద్దరూ ఎన్ఆర్ఐలు కావాలని స్వతహాగా ఎన్ఆర్ఐలు అయిన వరుణ్ సందేశ్, అనితలను ఎంపిక చేశారు. వరుణ్ సందేశ్ కొన్ని కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా చేశాడు. ప్రేమను వ్యక్తం చేసి మళ్లీ విరహంగా సాగే కీలక సన్నివేశాల్లో మాత్రం అతని నటన నప్పలేదు. ఇక అనితకు ప్రధాన సమస్య డబ్బింగ్... అయితే ఆమె చూపుల్లో సెక్సప్పీల్ కనిపిస్తోంది. నిజమైన ప్రేమికురాలిగా ఒక్క సన్నివేశంలో మినహా మిగిలినచోట్ల అతకలేదు. శ్రద్దాదాస్ పాత్ర రొటీన్ గానే ఏదో ఎక్స్ ట్రా పాత్ర మేరకే ఉంది. ప్రతాప్ పోతన్, కోట, ఊర్వశి, తమ తమ పాత్రలను పండించారు.స్వతహాగా కెమేరామెన్ అవడం వల్ల రవియాదవ్ నైపుణ్యం ఇందులో మెచ్చుకునే స్థాయిలో ఉంది. మిక్కీజే మేయర్ సంగీతం బాగానే ఉంది. కథను నడిపే విధంగా స్క్రీన్ ప్లే లేదు. కాస్త గందరగోళంగా కనిపిస్తుంది. దిల్ రాజు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇది మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. క్లాస్ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది. మొదటి భాగమంతా ఫర్వాలేదనిపించినా రెండో భాగంలో కాస్త నిదానించి సన్నివేశాలు అతుక్కుపోవడంతో కాస్త గందరగోళంగా ఉంది. వెరసి ఈ చిత్రం అలనాటి మరోచరిత్రను చూసిన వారికి ఏ మాత్రం నచ్చదు. కొత్తగా యూత్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన లవ్ స్టోరీ ఇది

ఒట్టు... అర్థ భాగం అబద్ధం "డార్లింగ్" review


నటీనటులు: ప్రభాస్, కాజల్ అగర్వాల్, శ్రద్దా ఆర్య, తమళి హీరో ప్రభు, తులసి, చంద్రమోహన్, ధర్మవరపు, ఆహుతి ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్ నారాయణ, రాజీశ్రీధర్ తదితరులుసాంకేతిక సిబ్బంది:- మాటలు: స్వామి, సంగీతం: జి.వి ప్రకాష్, కెమేరా: ఆండ్రూ, నిర్మాత: బివిఎస్ఎన్ ప్రసాద్, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: కరుణాకరన్పాయింట్: చిన్ననాటి స్నేహితుల పిల్లలు ప్రేమలో పడి యుక్త వయస్సులో ఒకటయితే ఎలా ఉంటుందనేది.మాస్ చిత్రాలు ప్రభాస్‌కు "డార్లింగ్" క్లాస్ తరహా మూవీ. ఎక్కువ కష్టపడకుండా స్ట్రెయిటిష్‌గా లాగించేశాడు. భిల్లా ఒక రకమైన క్లాస్ అయితే ప్రేమలో క్లాస్ ఎలా ఉంటుందో డార్లింగ్‌లో చూపాడు. మొదటి భాగం ప్రభాస్ కల్పిత కథతో ఇంటర్‌వెల్ పడుతుంది. రెండో భాగం ఆ కల్పితం నిజమయితే ఎలా ఉంటుంది..? అనేది కొన్ని ట్విస్టులతో కరుణాకరన్ చూపాడు.కథ ప్రారంభం... 1980లో బ్లాక్ అండ్ వైట్ ఎపిసోడ్.. అందులో ప్రభు, చంద్రమోహన్, ధర్మవరపు, ఆహుతి ప్రసాద్, ఎం.ఎస్.నారాయణ ఒకే కాలేజీలో స్నేహితులు. ఫేర్వెల్ అయ్యాక మళ్లీ కలుసుకోలేమని బాధపడుతూ విడిపోతారు. ఎవరెంత పొజిషన్లో ఉన్నా అంతా ఒక్కసారి కలవాలనేది వారి ఒప్పందం. అప్పుడే ఆహుతి ప్రసాద్ కుమార్తె నందిని( కాజల్ అగర్వాల్), ప్రభు కొడుకు ప్రభాస్( ప్రభాస్) డాన్స్ మెచ్చుకుని అతనికి ఫ్యాన్ అవుతుంది. కట్ చేస్తే... వివిధ ప్రాంతాల్లో ఎవరికి వారు స్థిరపడతారు. ప్రభాస్ తండ్రి హైదరాబాదులో ఉంటే.. నందిని కుటుంబం స్విట్జర్లాండులో ఉంటుంది. ప్రభాస్ హైదరాబాదులో డాన్స్ ట్రూప్ మెయిన్‌టైన్ చేస్తుంటాడు. శ్రీనివాస రెడ్డి, రాజా శ్రీధర్ మరో ఇద్దరు స్నేహితులు. ఆ గ్రూపులో శ్రద్దా ఆర్య కూడా ఉంటుంది. ప్రభాస్‌ను ప్రేమిస్తున్నానంటే.. నాకా ఉద్దేశం లేదంటాడు. దీంతో కలత చెంది ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతుంది. ఈ విషయం తెలిసిన గూండా అయిన ఆమె తండ్రి ముఖేష్ రుషి ప్రభాస్‌ను నిలదీస్తాడు. తను స్విట్జర్లాండులో నందిని అనే అమ్మాయిని ప్రేమించాననీ, ప్రేమను వ్యక్తం చేసే టైమ్‌లో ఆమెకు యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్లిందని కథ చెపుతాడు. దాంతో గూండా కరిగిపోయి ప్రభాస్‌ను వదిలేస్తాడు. ఆ తర్వాత ప్రభాస్ తండ్రి స్నేహితులు తమ కుటుంబాలతో గెట్ టుగెదర్‌లా అరకులో కలుస్తారు. నందినికోసం వచ్చిన ప్రభాస్‌కు అక్కడ మరో స్నేహితుడైన ఎమ్మెస్ కొడుకు రుషి నందినిని పెండ్లి చేసుకోవానుకుంటున్నాడని తెలుసుకుంటాడు. ఆ పెండ్లి తన భుజాలపై వేసుకుంటాడు ప్రభాస్ తండ్రి. షాక్‌కు గురయిన ప్రభాస్ అక్కడ నుంచి వెళ్లి పోతుండగా ఎమ్మెస్ వచ్చి రుషి అసలు తన కొడుకు కాదని ట్విస్ట్ ఇస్తాడు. అప్పుడు ప్రభాస్ ఏం చేశాడు...? కాజల్ ఎవరికి దక్కింది..? అనేది తెరపై చూడాల్సిందే. నటనాపరంగా ప్రభాస్‌కు మార్కులేయాల్సిందే. చాలా సాఫ్ట్‌గా ఉంటూ తన స్నేహితులతో కామెడీ చేయిస్తూ ప్రేక్షకుల్ని ఎంజాయ్ చేయించాడు. అవసరమైన చోటే ఫైట్స్ చేసే సన్నివేశాలు అమరాయి. ముఖ్యంగా నందిని తమ్ముడు ప్రభాస్ స్నేహితుల్ని బురుడీ కొట్టించే సన్నివేశాలు ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. కాజల్ అగర్వాల్ నటన బాగుంది. జోడి సరిపోయింది.స్నేహితుల కుటుంబాల్లో శివన్నారాయణ మాట్లాడితే... తిన్నారా... అనే డైలాగ్ బాగా ఆకట్టుకుంది. 30 రోజుల్లో ఆంగ్లం నేర్చుకొనలేకపోయినా ప్రభాస్ తల్లి ఆంగ్లంలో మాట్లాడేది రొటీన్ అయినా గుంపులో గోవిందగా కొట్టుకుపోతుంది. ఆహుతి ప్రసాద్ తండ్రి కోట శ్రీనివాసరావు హుందాగా ఉన్నా క్లైమాక్స్‌లో ఒక్క డైలాగ్ మినహా మాటలుండవు. ప్రభాస్ స్నేహితులు, నందిని తమ్ముడి సన్నివేశాలు సరదాగా ఉంటాయి. అయితే కథలో రకరకాల ట్విస్టులతో ప్రేక్షకుల్ని కాస్త చికాకు తెప్పించారు. క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్లు ఎలాగూ ఒకటవుతారు కాబట్టి ఫ్యాక్షనిస్టు తరహాలో సుమోల్లో వచ్చిన ముఖేష్ రుషి, మళ్లీ ప్రభాస్, నందిని ప్రేమ చూసి చలించిపోతాడు. విలన్‌ను కూడా బఫూన్‌లా చూపించి ఎంటర్‌టైన్ చేశాడు కరుణాకర్.సంభాషణలపరంగా బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీకి టెక్నికల్ తోడై హైదరాబాదు ట్యాంక్‌బండ్, ఛార్మినార్ అంతా మంచుతో కప్పబడి ఉంటే ఎలా ఉంటుందో సరదాగా చూపాడు. పాటలు పెద్దగా గుర్తుండి పోయేలా లేవు. ఒకే ఒక్క పాట బాగుంది. మొదటి భాగం కల్పిత కథతో సరదాగా సాగితే రెండో భాగం సెంటిమెంట్, యాక్షన్‌తో ముగుస్తుంది. ఉల్లాసంగా .. ఉత్సాహంగా తర్వాత కరుణాకరన్ చేసిన చిత్రమిది. ప్రేమ చిత్రాలు తీయడంలో పేరున్న కరుణాకర్ ఈ చిత్రాన్ని మాత్రం అంత గొప్పగా తీయలేకపోయాడు. 80లో కథ ప్రారంభంలో విగ్గులు పెట్టిన దగ్గర్నుంచి చివర్లో ముఖేష్ రుషి విలన్ ప్రేమకు నీరుగారిపోయిన సన్నివేశం వరకూ ఒకరకమైన నవ్వు తెప్పిస్తాయి. భారీ తారాగణంతో రూపొందిన కాలక్షేప చిత్రమిది.