Pages

Sunday, May 2, 2010

దుష్ట శిక్షణకు వైద్యుడే.. నర "సింహా"వతారం ఎత్తితే..!?


నటీనటులు: నందమూరి బాలకృష్ణ, నయనతార, నమిత, స్నేహాఉల్లాల్, కె.ఆర్‌.విజయ, మలయాళ నటుడు సాయికుమార్‌, హేమంత్‌, శ్రావణ్‌, జీవీ, కిన్నెర, కోటశ్రీనివాసరావు, వేణుమాధవ్‌, బ్రహ్మానందం, ఝాన్సీ, అలీ, కృష్ణభగవాన్‌, ఎల్బీశ్రీరామ్‌, ఆనందభారతి తదితరులు.


సంగీతం: చక్రి,

నిర్మాత: పరుచూరి కిరిటీ,

బేనర్‌: యునైటెడ్‌ మూవీస్‌,

రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను.


పాయింట్‌: మనిషికి వ్యాధి సోకితే వైద్యం చేసే వైద్యుడు సమాజాన్ని పాడుచేసే వైరస్‌కు (దుష్టులను) ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చాడనేదే పాయింట్.



టైటిల్‌ వినగానే నరసింహనాయుడు, లక్ష్మీనరసింహా, సమరసింహారెడ్డి- ఇలా సింహా సెంటిమెంట్‌తో మళ్ళీ బాలకృష్ణ విజృంభిస్తాడని ముందుగానే చెప్పిన దర్శకుడు బోయపాటి శ్రీను అటువంటి తరహా కథతో ముందుకువచ్చాడు. ఇది పక్కా బాలయ్య మార్క్‌ సినిమా.



ఇన్నాళ్ళు ఎలాంటి కథాశంతో అభిమానుల్ని సంపాదించుకున్నాడో అలాంటి అభిమానులు మెచ్చేలా, వారి అంచనాలకు అనుగుణంగా బాలయ్య కథాంశాన్ని ఎంచుకున్నాడు. దీనికితోడు నాలుగు పాటలుకూడా బాగుండడంతో సింహా ఫ్యాన్స్‌కు ఫుల్‌మీల్స్‌‌ అయ్యింది.



అయితే భద్ర, తులసిలో ఉన్నట్లే... దర్శకుడు బాలయ్య రేంజ్‌కు తగినట్లుగా బాంబు పేలుళ్లు, కత్తులతో నరకడాలు మామూలుగా ఉన్నాయి. కొన్ని చోట్ల డైలాగ్స్‌లు ఆవేశంగా 'లంజకొడకా..' అంటూ ఉన్నా సన్నివేశపరంగా కొట్టకుపోయాయి. కాకపోతే వయొలెన్స్‌ ఎక్కువగా ఉన్న ఈ చిత్రాన్ని హ్యుమన్‌రైట్స్‌ సంస్థలు వేలెత్తిచూపుతాయోనని చిన్నపాటి సందేహంకూడా ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇక.. ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య మెప్పించాడు.




కథలోకి వెళితే...? విజయనగరం జిల్లా బొబ్బిలిలో రెండే పెద్ద కుటుంబాలు. అందులో ఒకటి నరసింహా (బాలకృష్ణ) కుటుంబం. మరొకటి కోటశ్రీనివాసరావు కుంటుంబం. వీరిలో నరసింహా చెడును ఏ మాత్రం సహించడు. ప్రజలకు మంచిచేయాలనుకుంటాడు. కానీ కోటశ్రీనివాసరావు కుటుంబం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంది.



ప్రజలు ఏమైనా పర్వాలేదు. వారందరూ తాము చెప్పినట్లే వినాలి. పోలీసువ్యవస్థను కూడా చేతుల్లో తీసుకుని కోటశ్రీనివాసరావు బోలెడు అరాచకాలు చేస్తుంటాడు. ఇది సహించని నరసింహ వారికి బుద్దిచెప్పే క్రమంలో కోట కొడుకుల్లో ఇద్దరిని చంపేస్తాడు. దీంతో పగ, ప్రతీకారంతో రగిలిపోతున్న కోటశ్రీనివాసరావు మరో కొడుకు సాయికుమార్‌, నరసింహ కుటుంబాన్ని తుదముట్టిస్తాడు.



కానీ అందులోని వంశోద్ధారకుడు శ్రీమన్నారాయణ (బాలకృష్ణ)ను నాయనమ్మ కె.ఆర్‌. విజయ రహస్యంగా తప్పించి హైదరాబాద్‌ సిటీకి వచ్చి పెంచుతుంది. పెద్దవాడయిన శ్రీమన్నారాయణ కాలేజీ ప్రొఫెసర్‌. ఆయనలోనూ అదే పోకడ. చెడును సహించడు. ఈ క్రమంలో ఈవ్‌టీజింగ్‌, డ్రగ్స్‌కు బానిసలైన యువకులకు బుద్ధిచెబుతాడు.



ఆ క్రమంలో జానకి (స్నేహ ఉల్లాల్‌) అనే స్టూడెంట్‌ను వదిన అని సంబోధిస్తూ.. ఓ రౌడీ తన అన్న రమ్మంటున్నాడని బలవంతంగా తీసుకెళతాడు. ఆ రౌడీ నుంచి స్నేహాఉల్లాల్‌ను శ్రీమన్నారాయణ కాపాడి, ఆమె ఫ్యాష్‌బ్యాక్‌ తెలుసుకుని తను ఆశ్రయమిస్తాడు.



జానకి ఉన్న విషయాన్నితెలుసుకుని ఆమె తండ్రి రఘు వచ్చి అనుకోకుండా అక్కడ జరిగే గొడవల్లో శ్రీమన్నారాయణను పొడవబోయి బామ్మను పొడుస్తాడు. కసితో రఘును కత్తితో పొడుస్తుండగా బామ్మ వారిస్తుంది. అసలు రఘు ఎవరు..? శ్రీమన్నారాయణ ఎవరు..? జానకి ఎవరు..? అనే విషయాలు తెలియాలంటే మిగిలిన సినిమా చూడాల్సిందే.



ఇందులో కాలేజీ ప్రొఫెసర్‌ ఎపిసోడ్‌ మొదటి భాగంగా.. బొబ్బిలి ఎపిసోడ్‌ రెండో భాగంగా వస్తుంది. బాలకృష్ణ ప్రొఫెసర్‌గా సూటయ్యాడు. అదేవిధంగా నరసింహా పాత్రలోనూ ఇమిడిపోయాడు. డైలాగ్‌ డెలీవర్‌లో కొత్తగా కన్పించాడు. లెంగ్తీ డైలాగ్‌లు లేకుండా సింపుల్‌గా ఉన్నా, ఇందులోనూ తన వంశం గురించి ప్రస్తావించే సంభాషణలు చొప్పించారు.



ఆయన భార్యగా నయనతార నటించింది. ఇంతకుముందు చిత్రాల్లో ఓ మోస్తరు బొద్దుగా ఉండే నయనతార చాలా తగ్గింది. బామ్మగా కె.ఆర్‌. విజయ పాత్రకు సరిపోయింది. స్నేహ ఉల్లాల్‌ తండ్రిగా రఘు నటించాడు. పనివాళ్ళుగా ఝాన్సీ, బ్రహ్మానందం నటించారు. విజయనగరం యాసను ఝాన్సీ సునాయాసంగా పలికింది.



అలీ, కృష్ణభగవాన్‌‌ పాత్రలు కాస్త నవ్విస్తాయి. సాఫ్ట్‌వేర్‌ బూమ్‌ పడిపోతే వారి ఎలాంటి జీవనం సాగిస్తారనేది అలీ పాత్ర ద్వారా దర్శకుడు చక్కగా చూపాడు. కాలేజీ లెక్చరర్‌గా నమిత కాస్త గ్లామర్‌తో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్‌ చేసింది.



ఇకపోతే ఈ సినిమాకు కెమెరా పనితనం ప్రత్యేక ఆకర్షణ. సిరివెన్నెల, చంద్రబోస్‌ పాటలు అలరించాయి. "సింహంలాంటి చిన్నోడు వేటకొచ్చాడు.." అనే మాస్‌ పాట ఆకట్టుకుంది. "బంగారుకొండ మువ్వులదండ.." అనే పాట నయనతార, బాలయ్యతో చిత్రించినా సందర్భానుసారంగా ఉంది.



కథ సీరియస్‌గా నడుస్తుండగా.. 'జానకి జానకి.. అని సాగే చివరి పాట బ్రేక్‌లా వేసి.. ప్రేక్షకుల్ని డైవర్షన్‌ చేసి కాస్త రిలీప్‌ ఇచ్చాడు. అయినా ఇది అడ్డంకిగా ఉంది. సంభాషణలు పొందికగానే ఉన్నాయి. 'డాక్టర్‌కు కుట్లు వేయడమేకాదు. పోట్లు వేయడం కూడా తెలుసు.. వంటి కొన్ని డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి.



మొత్తానికి ఇది బాలయ్య ట్రేడ్‌ చిత్రం. 'మిత్రుడు' అంతటి ఫ్లాప్‌ తర్వాత బాలయ్య ఎటువంటి సినిమా చేస్తాడనేది ఫ్యాన్స్‌లోనూ ప్రేక్షకుల్లోనూ నెలకొన్న ఉత్కంఠకు "సింహా" ద్వారా తెరదించాడు. మంచి కథా వస్తువుతో బాలయ్య మెప్పించాడు. ఇంకేముంది..? మరి.. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ రేంజ్‌కు తీసుకుకెళ్ళాతారో..? వేచి చూడాల్సిందే..!?

1 comment: